భారత్ సమాచార్, జాతీయం: సీపీఐ (M) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దేశ రాజకీయాల్లో తనదైన శైలిలో పాత్ర పోషించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు చేసిన ఘనత ఆయనది. విద్యార్థి నేతగా, రాజ్యసభ సభ్యుడిగా అనేక సేవలందించారు. దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 12 2024 గురువారం తుది శ్వాస విడిచారు.
సీతారాం ఏచూరి 1952లో మద్రాసులో స్థిరపడినటువంటి తెలుగు కుటుంబంలో జన్మించిన వ్యక్తి. ఈయన తల్లిదండ్రులు ఏచూరి సర్వేశ్వర సోమయాజి. తల్లి ఏచూరి కల్పకం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కంద మేనల్లుడు ఏచూరి
సీతారాం. ఏచూరి సీతారాం తల్లి కల్పకం.. ప్రముఖ సంఘసంస్కర్త దుర్గాబాయి దేశముఖ్ శిష్యురాలు. సీతారాం ఏచూరికి ఇద్దరు భార్యలు. ముగ్గురు సంతానాన్ని కలిగి ఉన్నారు. సీతారాం విద్యాభ్యాసం మొత్తం దేశ రాజధాని ఢిల్లీలోనే కొనసాగింది. ఢిల్లీ ఎస్టేట్ పాఠశాలలో విద్యను అభ్యసించారు. సీబీఎస్ఈ పరీక్షల్లో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్ స్టీఫెన్ కళాశాలలో బిఎ ఆర్థిక శాస్త్రం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పట్టా పొందారు. డిగ్రీ పీజీ రెండింటిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టు అయ్యారు. అనంతరం జేఎన్యులో పిహెచ్డీ లో చేరినప్పటికీ ఏచూరి డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు.
ప్రపంచం మేధావి సీతారాం ఏచూరి మరణం వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు. సీపీఎం పార్టీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు పార్టీలకు తీరని లోటు అనే చెప్పాలి. సీపీఎం పార్టీ అఖిలభారత ప్రధాన కార్యదర్శిగా ఏచూరి పని చేశారు. రాజ్యసభ సభ్యులుగా సీపీఎం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంతో క్రియాశీలక పాత్ర పోషించారు ఆయన. రాజ్యసభలో ఆయన ప్రసంగాలను ప్రధాన మంత్రులు, మంత్రులు సైతం ఆసక్తిగా వినేవారు. ఎమర్జెన్సీ రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి అధ్యక్షుడిగా విద్యార్థి సంఘ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత కాలంలో సీపీఐ (M) పార్టీలో అంచలంచలుగా ఎదుగుతూ పార్టీ అఖిల భారత కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
సీతారాం ఏచూరి మరణ వార్త యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. సీపీఐ (ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మృతిపట్ల యావత్ దేశం, కమ్యూనిస్టు యోధులు, కమ్యూనిస్టు అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. విద్యావేత్తగా ఉన్న ఏచూరి సీపీఎం పార్టీలో చేరి క్రియాశీలంగా నిలిచారు. అనేక ప్రజా, కార్మికోద్యమాలకు నాయకత్వం వహించారు. దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సీపీఎం, అనుబంధ ప్రజా సంఘాల్లో ఎన్నో పదవులు చేపట్టి అంచెలంచెలుగా దేశ నాయకుడిగా ఎదిగాడు. బలమైన రాజకీయ నాయకున్ని దేశం కోల్పోయింది. ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటు.
జీవితకాలం కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి పేదల పక్షాన దేశ స్థాయిలో గళం వినిపించిన వ్యక్తి ఏచూరి. దేశ రాజకీయాల్లోఆయన లేని లోటు తీర్చలేనిది. అశ్రునయనాలతో యావత్ దేశం ఆయనకు నివాళులర్పిస్తోంది.