భారత్ సమాచార్, విద్య ;
ఆంధ్రప్రదేశ్ లో పాలిసెట్ తుది దశ కౌన్సెలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి కొన్ని కళాశాలల్లో మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలిన సీట్లను పాలిసెట్ అర్హత సాధించినా, అర్హత లేని అభ్యర్థులతో ఆయా పాలిటెక్నక్ ల స్థాయిలో భర్తీ చేస్తామని కన్వీనర్ తెలియజేశారు. ఇప్పుడు పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఖాళీ సీట్ల కోసం సంబంధిత పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్లను సంప్రదించి స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు.పాలిటెక్నిక్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను శాఖలు, కేటగిరీల వారీగా జులై 27వ తేదీన నోటీస్ బోర్డులో పెడతారని కన్వీనర్ గణేష్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, నిర్ణయించిన రుసుముతో జులై 31వ తేదీన వ్యక్తిగతంగా విద్యార్థులు సీటు ఆశిస్తున్న పాలిటెక్నిక్లకు హాజరు కావాలని కన్వీనర్ స్పష్టం చేశారు. పాలీసెట్ కౌన్సెలింగ్ ద్వారా ఇప్పటికే కేటాయింపు పొందిన, కోర్సుల్లో చేరిన అభ్యర్థులు స్పాట్ అడ్మిషన్కు అర్హులు కాదని కన్వీనర్ తెలిపారు. స్పాట్ అడ్మిషన్ ద్వారా ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని వెల్లడించారు.