భారత్ సమాచార్.నెట్, చెన్నై: సుప్రీంకోర్టు (Supremecourt)లో తమిళనాడు (Tamilnadu)లోని స్టాలిన్ ప్రభుత్వానికి (Stalin Govt) ఊరట లభించింది. డీఎంకే ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులపై సంతకాలు చేయకుండా పెండింగ్లో పెట్టడంపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఎంకే స్టాలిన్ ప్రభుత్వం పంపిన 10 బిల్లులను గవర్నర్ ఆర్ ఎన్ రవి (Governor RN Ravi)ఆమోదించకుండా.. వాటిని రాష్ట్రపతి (President)కి పంపడాన్ని తప్పుబట్టింది. ఇది చట్టవిరుద్ధమని, ఏకపక్ష నిర్ణయమని కోర్టు వ్యాఖ్యానించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ బిల్లులను గవర్నర్కు తిరిగి పంపిన తేదీ నుంచే ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ జేబీ పార్దివాలా (J.B. Pardiwala), జస్టిస్ ఆర్. మహాదేవన్ (R. Mahadevan) ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.
Supremecourt: గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు అసహనం
అయితే తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ రవికి పంపగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తనవద్దే పెట్టుకున్నారని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులను సమ్మతించకపోవడం, పునఃపరిశీలించాలని సూచిస్తూ వెనక్కి కూడా పంపడం లేదని పిటిషన్లో పేర్కొంది. రెండోసారి ఆమోదించిన బిల్లుల విషయంలో ఆయన తీరు మారట్లేదని పేర్కొంది. ఈ వ్యవహారంపై తాజాగా విచారించిన సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. మరోవైపు సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన సీఎం ఎంకే స్టాలిన్.. తమిళనాడుతోపాటు రాష్ట్రాలన్నింటికి ఇది భారీ విజయమన్నారు.
ఇకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం.. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ ముందుకు వచ్చినప్పుడు ఆయనకు కొన్ని అధికారాలు ఉంటాయి. గవర్నర్ ఆ బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం నిలిపివేయవచ్చు. కొన్ని సవరణలతో బిల్లును తిరిగి శాసనసభకు పంపవచ్చు. అయితే, శాసనసభ తిరిగి ఆమోదించి పంపితే గవర్నర్ తప్పనిసరిగా దానికి ఆమోదం తెలపాలి. ఒకవేళ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా ఉందని లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశమని గవర్నర్ భావిస్తే, దానిని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపవచ్చు.
RELATED ARTICLES