భారత్ సమాచార్.నెట్: లక్షలాది మంది విద్యార్థులు (Students) ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇంటర్ ఫలితాలు (Inter Results) మంగళవారం విడుదలయ్యాయి. హైదరాబాద్ (Hyderabad) నాంపల్లిలోని ఇంటర్ బోర్డు (Inter Board) కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఫలితాలను విడుదల చేశారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ను వారం రోజులు సమయం ఇవ్వనున్నారు. ఇక ఇంటర్ అడ్వాన్సడ్, సప్లిమెంటరీ పరీక్షలను మే 22 నుంచి నిర్వహించనున్నారు. ఇక విద్యార్థులు తమ ఫలితాలను www.tgbie.cgg.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తాజా ఫలితాల్లో ఎప్పటిలాగానే అమ్మాయిలు అదరగొట్టారు. టాప్ ర్యాంకులన్నీ అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. ఇంటర్లో ఫస్టియర్లో 66.89 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, సెకండియర్లో 71.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 9.97 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రాశారు. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 9.50 మంది విద్యార్థులకు ఈ పరీక్షలు రాశారు. వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఉండగా.. 5 లక్షలకుపైగా సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.
ఇకపోతే గత ఏడాది ఫలితాల విడుదల సమయంలో సర్వర్ సమస్యలు ఎదురైన సందర్భాలను దృష్టిలో పెట్టుకొని.. ఎలాంటి సాంకేతిక ఆటంకాలు తలెత్తకుండా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ నిర్వహణ బాధ్యతను కూడా సీజీజీ చేపట్టింది. ఫలితాల విడుదలకు ముందే, విద్యార్థుల మనోధైర్యాన్ని పెంపొందించేందుకు ఇంటర్మీడియట్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒక సందేశాన్ని పంపించారు. మార్కుల ఆధారంగా మాత్రమే విద్యార్థుల ప్రతిభను నిర్ణయించలేమని.. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తులను గుర్తించి వారిని ప్రోత్సాహించాలని సూచించారు.