భారత్ సమాచార్, హైదరాబాద్ ;
హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం సమకూర్చే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్లు, రవాణా విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి.. రెండింటినీ సమపాళ్లలో కొనసాగించడానికి ఆదాయ వనరులను పెంచుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్టానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత నెలవారి లక్ష్యాలను నిర్ధేశించుకుని పనిచేయాలని అధికారులను ఆదేశించారు. పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని స్పష్టంచేశారు.
- ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిర్ధేశించుకున్న వార్షిక లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రతి నెలా టార్గెట్ పెట్టుకుని రాబడి సాధించాలని, ఇకనుంచి ప్రతి నెలా పరిస్థితులను సమీక్షిస్తామని చెప్పారు. ప్రధానంగా జీఎస్టీ విషయంలో వాణిజ్య పన్నుల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించరాదన్నారు.
- పెట్రోల్, డీజిల్పై వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గడంపై, మద్యం విక్రయాలు జరిగినా ఆ మేరకు ఆదాయం పెరక్కపోవడం వంటి అంశాలపై ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణాను కఠినంగా అడ్డుకట్ట వేయాలని చెప్పారు.
- రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వంటి అభివృద్ధి పనులతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగానికి పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడిందన్న అంశంపై చర్చ జరిగింది. కమర్షియల్ నిర్మాణాలు, గృహ నిర్మాణాలు పుంజుకున్నాయని తెలిపారు.
- రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ ద్వారా వచ్చే ఆదాయంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.