భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి నుంచి భారత్ కోలుకోకముందే మరో ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలపై సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అధికారులను అప్రమత్తం చేశాయి నిఘా వర్గాలు. ఈ నేపథ్యంలోనే భారత్లోని అన్ని విమానాశ్రయాల వద్ద హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు. స్వాంతంత్య్ర దినోత్సవానికి దేశం సిద్ధమవుతున్న వేళ ఉగ్రముప్పు వార్తులు రావడం కలకలం రేపుతోంది.
నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్టులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలిపాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్యలో ఈ దాడులు జరగవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికతో అప్రమత్తమైన కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో.. దేశంలోని అన్ని విమానాశ్రయాలకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాశ్రయాల్లో వెంటనే కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రన్వేలు, హెలిప్యాడ్స్, ఫ్లైయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో భారీ భద్రత ఏర్పాటు చేయాలని సూచించింది.
విమానయన భద్రతా బ్యూరో అడ్వైజరీతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్టులోని టర్మినల్స్, పార్కింగ్ ప్రాంతాలు, తదితర చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. స్థానిక పోలీసుల సహాయంతో ఎయిర్పోర్టుకు వెళ్లే మార్గాల్లో తనిఖీలు చేపడుతున్నారు. అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో పంపే మెయిల్ పార్సిళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎయిర్పోర్టుల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే విమానాశ్రయ అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు.