భారత్ సమాచార్.నెట్: రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం (New Academic year) గురువారం నుంచి అంటే జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే స్కూల్ ఎడ్యుకేషన్ 2025-26 (School Education) అకడమిక్ క్యాలెండర్ (Academic Calendar)ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 12న క్లాసులు ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 23న లాస్ట్ వర్కింగ్ డేగా ప్రకటించింది. ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు.
2025-26 విద్యాసంవత్సరానికి మొత్తం 230 పనిచేసే రోజులు ఉండనున్నాయి. అంతేకాకుండా, ఇప్పటికే ప్రారంభమైన బడిబాట కార్యక్రమం ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనుంది. ఇక సమ్మేటివ్-1 (SA1) పరీక్షలు అక్టోబర్ 24 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. సమ్మేటివ్-2 (SA2) పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి 18 వరకు జరుగనున్నాయి. 10వ తరగతి ప్రీఫైనల్స్ ఫిబ్రవరి 28లోగా పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. మార్చి నెలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు.
ఇక ప్రతి నెల మొదటి వారం పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (AAPC) సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రతి నెల మూడవ శనివారాన్ని నో బ్యాగ్ డేగా జరపనున్నారు. అదేవిధంగా దసరా సెలవులు: సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు ప్రకటించగా.. క్రిస్మస్ సెలవులు (మిషనరీ పాఠశాలలకు మాత్రమే): డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 27 వరకు ప్రకటించింది. ఇక సంక్రాంతి సెలవులు: జనవరి 11 నుంచి జనవరి 15 వరకు ఇవ్వనున్నట్లు పేర్కొంది.