భారత్ సమాచార్,జాతీయం ;
రవి అస్తమించని సామ్రాజ్యం(బ్రిటీష్) భారత దేశంలోకి ప్రవేశించిన రోజులవి. మొత్తానికి ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి ఇక్కడ వ్యాపారం చేస్తాం అని ఇండియా వచ్చేశాడు.ఆ తర్వాత మన మీదే రెండు శతాబ్దాల పాటు పెత్తనం కూడా చెలాయించాడు. మొదట్లో బ్రిటీష్ వాడికి మన భాష రాదు. మనకు కూడా వాళ్ల భాష రాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను నేర్చుకోవటం మొదలు పెట్టారు. వాళ్ల అవసరాలకి అనుగుణంగా డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు-ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు.1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు.మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా.ఈ అవసరం వాళ్లదే కాబట్టి.. జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852లో తయారు చేశాడు.చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు, ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కానీ అందరికీ అంత దృశ్యం ఉండేది కాదు. వీళ్లు ముక్కస్యముక్కానువాదం చేసేవారు. చిత్ర విచిత్రంగా అను”వధించే” వారు.
అలాంటి సమయంలో తెల్లోడి భాషను తెల్లోడి కన్నా తేటతెల్లంగా నేర్చుకుని, ధారాళంగా మాట్లాడేయడం అంటే మామూలు విషయం అస్సలు కాదు. అప్పటికి ఇంకా ఇంగ్లండుకు పోయి ఉన్నత విద్య నేర్చుకోవడం వంటివి అలవాటు కాలేదు. అలాంటి రోజుల్లో తెల్లోడే తెల్లబోయేలా ఇంగ్లీషు మాట్లాడే వాడికి బోలెడంత డిమాండ్ ఉండేది. సరిగ్గా అలాంటి వాడే పావులూరి శంకరనారాయణ . సొంతూరు నెల్లూరు. కానీ మద్రాసులో స్థిరపడ్డారు. తండ్రి రామానుజం చెట్టి నుంచి ఇంగ్లీషు నేర్చుకున్నారు. తండ్రిలాగానే దుబాషీ అయ్యారు. తండ్రి గంజాంలో రస్సెల్ అనే తెల్లదొరకు దుబాషీగా పనిచేసేవాడు. ఈయన విజయనగరం మహారాజా, జయపురం మహారాజా, పిఠాపురం, కొచ్చి, నూజివీడు జమీందారీ కుటుంబాల పిల్లలకు ఇంగ్లీషు చదువులు చెప్పేవారు. ఆ తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్కల మేస్టారుగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో పరీక్షాధికారిగా కూడా పనిచేశారు. అంటే తన జీవిత కాలంలో ఆయన తమిళనాడు రాజధాని మద్రాసు, ఒరిస్సాలోని గంజాం, జయపురం, మన రాష్ట్రంలోని విజయనగరం, పిఠాపురం, నూజివీడు, నెల్లూరు, కేరళలోని కొచ్చి లను సందర్శించాడన్న మాట. ఆ రోజుల్లోనే ఉద్యోగాల కోసం ఊరు వదలిన మహాసాహసి ఆయన.
రాచబిడ్డలకు చదువులు చెబుతున్నప్పుడే ఆయన వారి సౌలభ్యం కోసం ఇంగ్లీషు పదాలు, వాటి తెలుగు అర్థాల జాబితాను తయారుచేశారు. తర్వాత దాన్నే వ్యవస్థీకరించి తెలుగువాడు తయారు చేసిన తొలి ఇంగ్లీషు తెలుగు డిక్షనరీని తయారు చేశారు. అంతే కాదు, ఆయన తమిళ – ఇంగ్లీషు, ఇంగ్లీషు – తమిళ డిక్షనరీలను కూడా తయారు చేశారు. 1900 ప్రాంతంలో తెలుగు – ఇంగ్లీషు డిక్షనరీ కూడా తయారు చేశారు. తన అవసరం కోసం ఇంగ్లీషు వాడు తయారు చేసినవి కాకుండా మన అవసరం కోసం మనవాడు తయారుచేసిన మొట్టమొదటి డిక్షనరీలు ఇవేనేమో! ఆయన తయారుచేసిన తెలుగు డిక్షనరీ 1897లో ప్రచురితమైంది. దాని పేరే శంకరనారాయణ డిక్షనరీ. అప్పటి నుంచీ ఇంగ్లీషు నేర్చుకోవాలనుకున్న వారందరికీ శంకరనారాయణ డిక్షనరీయే ఆధారమైంది. అందరికీ ఆధునిక వేదమైంది. ఆయన బతికుండగానే అయిదు ముద్రణలకు నోచుకుంది. ప్రతి ముద్రణకీ కొత్త పదాలు జోడయ్యాయి. ఆయన 1924-25 ప్రాంతంలో చనిపోయారు.
ఆ తర్వాత 1927లో గిడుగు సీతాపతి, 1951లో చిలుకూరి నారాయణ రావు,వేదం లక్ష్మీనారాయణ కొత్తకొత్త పదాలను జోడించారు. 1953 లో నారాయణ అయ్యర్ దీనిని పరిష్కరించారు. ఇలా 1897 నుంచి 1953 వరకూ పదకొండు సార్లు పునర్ముద్రణ పొందింది ఈ డిక్షనరీ. 2004 అక్టోబర్లో విజయవాడకు చెందిన విక్టరీ పబ్లిషర్స్ దీన్ని మళ్లీ ముద్రించారు. ఆగస్టు 2005 నాటికి మలి ముద్రణ అవసరమైంది. మళ్లీ 2006, 2007లలో పునర్ముద్రించాల్సి వచ్చింది.