భారత్ సమాచార్, విజయవాడ ;
ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తర్వాత సీఎం జగన్ మొదటి సారి ఈ ఎన్నికలు, వాటి ఫలితాలపై మాట్లాడారు. ఏపీలో వైసీపీ పార్టీ గెలుపు కోసం పని చేసిన పొలిటికల్ కన్సల్టెన్సీ కంపెనీ ‘ఐప్యాక్’టీంతో విజయవాడలో నేడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఐప్యాక్ వ్యవస్తాపకుల్లో ఒకరైన ప్రశాంత్ కిషోర్కు (పీకే) సీఎం జగన్ ఐప్యాక్ ఆఫీస్ లోనే కౌంటర్ ఇచ్చారు. గతంలో వైసీపీకి పనిచేసినప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ చేసిందేమి లేదన్నారు. గ్రౌండ్ లో పనిచేసేదంతా టీమే అని వ్యాఖ్యానించారు. పీకే వైసీపీకి వ్యతిరేకంగా మారారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించని ఫలితాలు వస్తాయని చెప్పారు. గత ఎన్నికల్లో కూడా 151 సీట్లు వస్తాయని ఊహించలేదన్నారు. ఈసారి వచ్చే ఫలితాలతో దేశం షాక్ కాబోతుందన్నారు. ఈ సారి గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుపరిపాలన అందించామని పేర్కొన్నారు. కొన్ని సార్లు ఐప్యాక్ సేవలను పరిపాలనలోనూ ఉపయోగించామన్నారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలోని ప్రతి నాయకుడు ఏపీ వైపే చూస్తారని చెప్పారు. వచ్చే ఐదేళ్లు ఇంతకు మించి మంచి పరిపాలన అందిస్తామని చెప్పారు.