భారత్ సమాచార్, హైదరాబాద్ ;
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రస్తుతం ఉన్న కార్డుదారుల్లో అనర్హులను, మరణించిన వారి వివరాలను తొలగించి, కొత్త పేర్ల నమోదుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త రేషన్కార్డుల జారీకి సంబంధించిన పూర్తి విధివిధానాలను అధికారులు ఖరారు చేయనున్నారు. ఇప్పటికే ఒక్కో సర్కిల్లో సుమారు 20 వేల వరకు కొత్త పేర్ల నమోదుకు సంబంధించిన అభ్యర్థనలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల కోసం రాజధాని హైదరాబాద్లో నే 2.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరిలో 34 వేలు, రంగారెడ్డి జిల్లాలో 87వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించి కార్డులు అందజేయడం లేదా కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించి క్షేత్రస్థాయిలో ప్రస్తుతం పూర్తి సర్వే చేసి అర్హులను గుర్తించాల్సి ఉంది . ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరణించిన వారికి సంబంధించి తొలగింపులు జరిగినా కొత్త పేర్ల నమోదుకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో వారి దరఖాస్తులు కొన్నేళ్లుగా పెండింగ్లోనే ఉండిపోయాయి. తాజాగా రేషన్ కార్డుదారుల కేవైసీ ప్రక్రియ చేపట్టగా కార్డుదారుల్లో మరణించిన వారి వివరాలు ప్రభుత్వానికి తెలిశాయి. కొంతమంది పదేళ్లుగా మరణించిన వారి వివరాలు చెప్పకుండా రేషన్ తీసుకున్నట్టు తెలిసింది.