భారత్ సమాచార్, ఆరోగ్యం ;
ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం అందరం కూడా అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే మనం తినే ప్రతి ఒక్కటీ కూడా అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఇందు కలదు అందు లేదని మనం తినే ప్రతి వస్తువులోను ప్లాస్టిక్ చేరిపోతోంది. వందల రకాల క్యాన్సర్ ల్లకు కారణమవుతోంది. నేడు మరో శాస్త్రవేత్తల అధ్యయనం దీన్ని నిరూపించింది. తాజాగా భారతీయ ఉప్పు, చక్కెర బ్రాండ్లు అన్నీ మైక్రోప్లాస్టిక్స్ను కలిగి ఉన్నాయని ఇటీవల ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా, ప్యాకింగ్ చేసినవి, చేయనివి… ఇలా అన్నింట్లోనూ ఇవి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. పర్యావరణ పరిశోధన సంస్థ టాక్సిక్స్ లింక్ ‘మైక్రోప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్’ పేరిట ఈ అధ్యయనాన్ని ప్రపంచ స్థాయి నిపుణులతో నిర్వహించింది. దీనిలో భాగంగా టేబుల్ సాల్ట్, రాతి ఉప్పు, సముద్రపు ఉప్పు, స్థానిక ముడి ఉప్పు సహా 10 రకాల ఉప్పులతో పాటు ఆన్లైన్లో, స్థానిక మార్కెట్లో కొనుగోలు చేసిన వివిధ రకాల చక్కెర నమూనాలను ఇందులో పరీక్షించారు.