Homemain slidesమెయిల్ హ్యాక్ చేసి రూ.11.4 కోట్లు దోచేశారు

మెయిల్ హ్యాక్ చేసి రూ.11.4 కోట్లు దోచేశారు

భారత్ సమాచార్, ఏఐ న్యూస్ ;

సినిమా స్రీన్ ప్లే తరహాలో కొత్త రకం మోసానికి తెగబడ్డారు సైబర్ నేరగాళ్లు. ఎప్పటికప్పుడు అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత సాయంతో అప్డేట్ అవుతూ డిజిటల్ కరెన్సీ ని కొల్లగొడుతున్నారు. ఒక సంస్థ యొక్క మొయిల్ ని ఏఐ సాయంతో హ్యాక్ చేసి ఇలా కూడా మోసం చేస్తారా అనేట్టుగా ప్రణాళిక రచించారు.తాజాగా బ్యాంకు ఖాతాలు మారాయంటూ మెయిల్ చేసి ఓ సంస్థ నుంచి భారీ మొత్తంలో నగదును స్వాహా చేశారు. సైబర్‌ నేరస్థులు ఓ నకిలీ మెయిల్‌ పంపించగా.. దాన్ని గుడ్డిగా నమ్మిన సంస్థ నిర్వాహకులు వాళ్లు అడిగిన వివరాలు ఇచ్చేశారు. ఇంకేముంది క్షణాల్లో సంస్థ బ్యాంకు ఖాతా నుంచి రూ.11.4 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్‌లో ఈ షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలోని ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఉంది. అక్కడ ఆంకాలజీ, ఆప్తాలమిక్స్, హార్మోనల్‌ ఉత్పత్తుల్ని తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీలో ఇంటర్నల్‌ క్వాలిటీ కంట్రోల్‌ విషయాలకు సంబంధించి సంస్థకు ముడిసరకును సరఫరా చేసే వారి లావాదేవీలు ఆన్‌లైన్‌లో మాత్రమే జరుగుతుంటాయి. ఇలా ఆన్‌లైన్‌లో డబ్బులు పంపించే ప్రక్రియను ఓ లైఫ్‌సైన్సెస్‌ సంస్థ చూస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మే 11న లైఫ్‌ సైన్సెస్‌ సంస్థ పేరిట సదరు ఫార్మా కంపెనీకి ఓ మెయిల్‌ వచ్చింది. తమ సంస్థ బ్యాంకు ఖాతాలు మారాయని, కంపెనీ నుంచి రావాల్సిన సొమ్మును వేరే రెండు బ్యాంకు ఖాతాలకు పంపించాలనేది ఆ మెయిల్‌ సారాంశం. ఈ మెయిల్‌ తమ కంపెనీ లావాదేవీలు చూస్తున్న లైఫ్‌సైన్సెస్‌ సంస్థ పంపించిందని భావించిన కంపెనీ నిర్వాహకులు.. మెయిల్‌లో సూచించిన ఖాతాలకు 13,67,195 అమెరికన్‌ డాలర్లను పంపించారు.

అయితే అదే నెల 16వ తేదీన ముడిసరకు సరఫరాదారులకు తమకు ఇంకా పేమెంట్‌ అందలేదంటూ లైఫ్‌సైన్సెస్‌ సంస్థ నుంచి ఫార్మా కంపెనీకి ఫోన్‌ వచ్చింది. మెయిల్‌లో అకౌంట్లు మారాయని, వేరే అకౌంట్‌ నంబర్లు మీరే ఇచ్చారని, అలా ఇచ్చిన రెండు బ్యాంకు ఖాతాలకు ఐదు రోజుల క్రితమే డబ్బులు పంపించామని కంపెనీ ప్రతినిధులు బదులిచ్చారు. ఇక్కడే అసలు విషయం బయటపడి ఖంగుతిన్నారు. తాము అసలు ఎలాంటి మెయిల్‌ పంపలేదని లైఫ్‌సైన్సెస్‌ సంస్థ ప్రతినిధులు చెప్పడంతో ఫార్మా కంపెనీ ప్రతినిధులకు దిమ్మతిరిగింది. ఇదంతా సైబర్‌ హ్యాకర్లు చేసిన పని అని తెలుసుకున్న కంపెనీ చేసేదిలేక పోలీసులను ఆశ్రయించారు. తప్పుడు మెయిల్‌ పంపించి ఏకంగా రూ.11.4 కోట్లు తస్కరించినట్లు గుర్తించిన ఫార్మా కంపెనీ తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ)కు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్‌ బ్రాంచ్‌ దర్యాప్తు ప్రారంభించింది.

మరికొన్ని వార్తా విశేషాలు…

అప్పులు చేసి ఆన్‌లైన్ బెట్టింగ్.. చివరికి ?

RELATED ARTICLES

Most Popular

Recent Comments