భారత్ సమాచార్.నెట్: తెలంగాణ బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ‘ఆపరేషన్ కగార్’ ఆపాలంటూ రెండు వేర్వేరు నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి. ఏపీ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు ఐదు బృందాలు రంగంలోకి దిగాయని వారు తెలిపారు. తమ టీమ్లు హైదరాబాద్లో ఉన్నాయని, కాసేపట్లో చంపేస్తామని హెచ్చరించారు. దమ్ముంటే కాపాడుకోవాలన్నారు.
తమ ఫోన్లు ట్రేస్ చేసేందుకు యత్నిస్తున్నారని, తమ సమాచారం దొరకదని చెప్పారు. ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని దుండగులు బెదిరింపులకు దిగారు. మావోయిస్టుల నుంచి రఘునందన్ రావుకు ఇలా బెదిరింపులు రావడంతో ఇది రెండోసారి. ఈ నెల 23న ఎంపీకి తొలిసారి బెదిరింపు కాల్ వచ్చింది. తాను ఒక మావోయిస్ట్ నంటూ ఒక వ్యక్తి మధ్యప్రదేశ్ నుండి కాల్ చేశారు. సాయంత్రం లోగా నిన్ను లేపేస్తాం దమ్ముంటే కాపాడుకోండి అంటూ సవాల్ విసిరారు.
వెంటనే ఆయన డీజీపీ, మెదక్, సంగారెడ్డి ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో రఘునందన్రావుకు ప్రభుత్వం ఎస్కార్ట్ వాహనంతోపాటు అదనపు సిబ్బందితో రక్షణ కల్పించింది. అయితే రెండురోజుల క్రితం రఘునందన్ రావు యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మళ్లీ బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆయన ఆస్పత్రి నుంచే మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించాలని.. తనకు పదేపదే కాల్ చేసి బెదిరింపులకు దిగుతున్న వ్యక్తులను పట్టుకోవాలని కోరారు ఎంపీ రఘునందన్.