భారత్ సమాచార్, జాతీయం ;
అదేంటో గాని దేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాత్రం ఉప్పు, పప్పు నుంచి పెట్రోల్, డీజిల్ వరకూ కూడా వేటి ధరలు పెరగవు. అలా ఎన్నికలు పూర్తి అవ్వటం ఇలా నిత్యావసర ధరలు పెరగటం భారత్ లో ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఈ ఎన్నికల తర్వాత కూడా అదే ఆనవాయితీ కొనసాగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు జూన్ 1వ తేదీన జరిగే ఏడో దశ పోలింగ్ తో ఓటింగ్ ముగియనుంది. దీంతో 2వ తేదీ నుంచి అన్ని రకాల వస్తువుల, ఉత్పత్తుల రేట్లు పెంచేందుకు అందరూ సిద్ధం అయిపోయారు. ఇందులో మొదటగా టోల్ గేట్ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైంది.
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీల ను పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపు ను వాయిదా వేయాలని ఎన్హెచ్ఏఐని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు ముగియడంతో జూన్ 2 నుంచి టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచి వసూలు చేయనున్నారు. ఇదే కోవాలో టెలికాం సంస్థలు కూడా తమ సర్వీసుల టారీఫ్ ఛార్జీలు పెంచే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే పేర్కొన్నాయి.