భారత్ సమాచార్.నెట్: జమ్మూకశ్మీర్లోని (Jammu &Kashmir) పహల్గామ్లో (Pahalgam) ఈ నెల 22న పర్యాటకులపై (Tourists) ఉగ్రవాదులు (Terrorists) విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 28 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఈ దాడిని తామే చేశామని పాకిస్థాన్కు (Pakistan) చెందిన టీఆర్ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ ప్రకటన అనంతరం భారత్ (India) సహా ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమాయక ప్రజలపై చేసిన ఈ ఉగ్రదాడిని సీరియస్గా తీసుకున్న భారత్ పాకిస్థాన్పై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
ఈనేపథ్యంలోనే అనుహ్యంగా ఆ సంస్థ మాట మార్చి ట్విస్ట్ ఇచ్చింది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రసంస్థ తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. రెండు రోజుల క్రితం తమ నుంచి వచ్చిన ప్రకటనతో తమకు సంబంధం లేదని.. భారత్ తమ వ్యవస్థల్ని హ్యాక్ చేసిందని సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై ఇప్పటికే పూర్తి దర్యాప్తు చేస్తున్నామని.. రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ఇలా చేసిందని.. ఇది భారత్కు కొత్త ఏమీ కాదంటూ మాట మార్చింది. మొదట దాడి చేసింది తామేనని.. ఇప్పుడు చర్యలు తీసుకోవడంతో తమకు సంబంధం లేదని చెప్పడం పిరికిపంద చర్యగా నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
మరోవైపు భారత్ దెబ్బకు పాకిస్థాన్ విలవిలలాడుతోంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో.. పాక్ కాళ్ల బేరానికి వచ్చేందుకు సిద్ధమైంది. పహల్గామ్ ఉగ్రదాడిపై విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. తమకు మంచినీళ్లు కావాలని పాక్ ప్రధాని స్పష్టం చేశారు. 25 కోట్ల జనానికి సింధు నీళ్లే జీవన ఆధారం అంటూ కొత్త రాగం అందుకున్నారు. నీళ్ల కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తామంటూ చెప్పుకొచ్చారు.