భారత్ సమాచార్.నెట్: అమెరికా అధ్యక్షుడు (America President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల వివిధ దేశాలపై భారీగా టారిఫ్లు (Tariffs) విధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై ఇంచుమించు అన్ని దేశాలూ వ్యతిరేకించగా.. ప్రపంచ స్టాక్ మార్కెట్లు (International Stock Markets) సైతం తీవ్రంగా నష్టపోయాయి. అలాగే ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందని పలు నివేదికలు హెచ్చిరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజులపాటు వాయిదా (90 day Pause on Tariffs) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నిలుపుదల చైనాకు మాత్రం వరించదని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. అయితే ఒక్కరోజు తేడాలోనే చైనాపై అమెరికా మరోసారి సుంకాలు పెంచింది. 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక ట్రంప్ సర్కార్ తాజా నిర్ణయంతో బెంబేలెత్తిపోయిన ప్రపంచ మార్కెట్కు తాత్కాలిక ఊరటనిచ్చినప్పటికీ.. చైనాతో వాణిజ్య ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్నది. ఇరు దేశాలు పోటాపోటీగా ఒకరిపై ఒకరు సుంకాలు విధించుకుంటున్నాయి. చైన్పై ట్రంప్ 125 శాతం ప్రతీకార సుంకాలు విధించగా.. ప్రతిగా అగ్రరాజ్యం అమెరికాపై చైనా 84 శాతం టారిఫ్లు విధించింది.
మరోవైపు చైనా, అమెరికా మధ్య జరుగుతున్న టారిఫ్ వార్ నడుమ ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. జిన్పింగ్ చాలా స్మార్ట్ అని.. తెలివైన వ్యక్తి అని పొగిడారు. ఎప్పుడు ఏం చేయాలో అతనికి బాగా తెలుసని.. దేశం అంటే ఆయనకు అమితమైన ప్రేమ అన్నారు. సుంకాలపై తమతో చైనా ఒప్పందం కుదుర్చుకుంటుందని తాను భావిస్తున్నానని.. త్వరలోనే దీనిపై చర్చించేందుకు జిన్పింగ్ నుంచి తమకు ఫోన్ వస్తుందని.. దానికి తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఇక ఈ రెండు దేశాల మధ్య టారిఫ్ వార్ ఎప్పటి వరకు జరుగుతోందా చూడాలి మరి.