భారత్ సమాచార్.నెట్, తిరుమల: తిరుమల (Tirumala)లోని విశాఖ శారదా పీఠం (Visakha Sri Sarada Peetham) భవనానికి టీటీడీ నోటీసులు (TTD Notices) జారీ చేసింది. 15 రోజుల్లో భవనం (Building) ఖాళీ చేయాలని నోటీసుల్లో టీటీడీ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించారని.. కోర్టు కూడా టీటీడీకి అనుకూలంగా తీర్పునిచ్చిందని అధికారులు తెలిపారు. గత వైసీపీ (YCP) ప్రభుత్వం విశాఖ శారధ పీఠానికి తిరుమలలో స్థలం (Land) కేటాయించింది. ఆ స్థలంలో శారద పీఠం భారీ భవనాన్ని నిర్మిస్తోంది. అయితే భవన నిర్మాణంలో.. ప్రభుత్వం కేటాయించిన స్థలం కంటే మరి కొంత స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి.
ఈ క్రమంలోనే ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. దీనిపై చర్యలు చేపట్టింది. విశాఖ శారదా పీఠం భవన నిర్మాణంలో ఆక్రమణలు జరిగాయని టీటీడీ అధికారుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా శారదా పీఠం ఆక్రమణలను తొలగిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు బోర్డు సమావేశంలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు విశాఖ శారదా పీఠానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై మఠం నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు.
అయితే మఠం నిబంధనలు ఉల్లంఘించిందని గుర్తించిన కోర్టు.. మఠంపై చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉందని తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన నోటీసులపై శారదా పీఠం ఇంతవరకు స్పందించలేదు. భవనాన్ని కాళీ చేసి టీటీడీకి అప్పగిస్తారా.. మళ్లీ కోర్టును ఆశ్రయిస్తారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా భవనాన్ని స్వాధీనపరుచుకుని వేరే అవసరాలకు వినియోగించుకోవాలని టీటీడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.