భారత్ సమాచార్.నెట్: ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’ పేరుతో ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల కోసం అమెరికా విమానాలు భారత్ గగనతలాన్ని ఉపయోగించుకున్నాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన భారత్.. ఆ వార్తలను తీవ్రంగా ఖండించింది. అవి నకిలీ వార్తలు అని కొట్టిపారేసింది. ఈ విషయాన్ని పీఐబీ ఫ్యాక్ట్చెక్ ఎక్స్లో పోస్ట్ చేసింది.
ఈ దాడుల్లో పాల్గొన్న అమెరికా విమానాల మార్గాలను జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డేనియల్ కెయిన్ మీడియా సమావేశంలో వివరించారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. సంబంధిత వీడియో లింక్ను కూడా పీఐబీ షేర్ చేసింది. ఇక ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. ఈ దాడుల్లో అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో ఈ పరిస్థితి మరింత తీవ్రతరమైంది.
అమెరికా తమ అణు కేంద్రాలపై దాడులకు పాల్పడడాన్ని ‘హద్దులు దాటింది’గా అభివర్ణించిన ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ, తదుపరి పరిణామాలకూ వాషింగ్టన్ పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. అమెరికా దాడులకు తాము గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం సహకారంపై రెండు వారాల్లోగా చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ట్రంప్.. టెహ్రాన్పై రెండు రోజుల్లో దాడులు చేపట్టడం గమానర్హాం.