భారత్ సమాచార్.నెట్: ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రిషికేశ్- బద్రీనాథ్ జాతీయ రహదారిపై 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. రుద్రప్రయాగ్ జిల్లాలోని ఘోల్తీర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా 10 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. మిగిలిన ఏడుగురుని స్థానికుల సహాయంతో రెస్క్యూ బృందాలు రక్షించాయి.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అలకనంద నది పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకోవడం.. పలువురు గల్లంతవ్వడంపై ఆందోళన నెలకొంది. మరోవైపు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది.
ఇక రెస్క్యూ దళాలు రక్షించిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై పూర్తి సమాచారం బయటకు రాలేదు కానీ.. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా. డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడా? వాహనంలో లోపమా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.