భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం (Ap Deputy Cm) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) ఇటీవల అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి మార్క్ శంకర్ క్షేమంగా భయటపడటంతో.. భారత్కు వచ్చారు పవన్ కుటుంబసభ్యులు. అయితే కుమారుడికి ప్రమాదం తప్పడంతో పవన్ సతీమణి అన్నా లెజినోవా (Anna Lezhneva) తిరుమల (Tirumala) కు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కుమారుడి పేరుపై టీటీడీ అన్నదానం ట్రస్ట్కి విరాళం కూడా ఇచ్చారు.
అయితే అన్నా లెజినోవా క్రిస్టియన్ అయి ఉండి శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించడంపై కొందరు సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. అన్నా లెజినోవా ఇలా తలనీలాలు సమర్పించడంతో కొంత మంది గరికిపాటి నరసింహారావు చెప్పిన ప్రవచనాల్ని తెరపైకి తీసుకువచ్చారు. అసలు మహిళలు ఇలా తలనీలాలు సమర్పించకూడదని, ఆడవాళ్లు కేవలం రెండు, మూడు కత్తెర్లు ఇస్తే చాలని, భర్త ఉండగా ఇలా తలనీలాలు ఇవ్వకూడదని ఆయన చెప్పిన ప్రవచనాల్ని తెరపైకి తీసుకు వచ్చి విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలా ట్రోల్స్ చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియర్ టాలీవుడ్ నటి విజయశాంతి ఖండించారు.
సోషల్ మీడియా వేదికగా విజయశాంతి ఇలా రాసుకొచ్చారు. ‘దేశం కాని దేశం నుంచి వచ్చి.. పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవాగాపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు.. ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి.. అన్నదానం ట్రస్ట్కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవాని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు’ అని అన్నారు విజయశాంతి.