భారత్ సమాచార్, జాతీయం ; 2024 లోక్ సభ ఎన్నికల ముందు దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది దిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 15 మందిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. పలువురు ప్రముఖ రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తాజాగా దిల్లీ సీఎం కేజ్రీవాల్ ను, తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 28వరకు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. మళ్లీ ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే, ఇదివరకే ఈ కేసులో అరెస్టు అయిన సుఖేష్ చంద్రశేఖర్ తీహార్ జైలు నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాశారు. ‘‘తీహార్ క్లబ్కు బాస్గా మీకు స్వాగతం పలుకుతున్నా.. నాలుగు కుంభకోణాల్లో నేనే సాక్షిగా ఉన్నా.. అప్రూవర్గా మారి నిజాలు బయటపెడతా’’ అని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది.
జైలులో ఉన్నా దీల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాలే కొనసాగుతారని ఆప్ నాయకులు ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఆయన విచారణ కోసం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన పై ఉన్న అవినీతి ఆరోపణలు నిరూపణ అయ్యి, కేసులో శిక్ష పడే వరకూ కేజ్రీవాల్ జైలులో ఉన్నా కూడా సీఎంగానే కొనసాగవచ్చు.