భారత్ సమాచార్, అమరావతి ;
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. ఒక వైపు వైసీపీ పార్టీ ఏమో..నోటీసులు ఇవ్వకుండా సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు ఎత్తుకెళ్తున్నారు. ఇది మానవహక్కుల ఉల్లంఘన కాదా .. సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించడం కాదా? అని ప్రశ్నిస్తోంది. మరో వైపు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వారి అరెస్టును స్వాగతిస్తూ సోషల్ మీడియా ఎక్స్ లో ట్వీట్ చేశారు.
‘‘సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా. అలాంటి వ్యవస్థను కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం, నీచం లేకుండా భ్రష్టు పట్టించారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారు. మహిళలు అనే జ్ఞానం లేకుండా ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి కూడా సాటి మహిళా అనే ఇంగితం లేకుండా , రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందారు. సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరిగా చెప్తున్నాను…
అసభ్యకర పోస్టులతో ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెట్టీ .. పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలి. నా మీద, అమ్మ మీద, సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికే పుట్టలేదని అవమానించారు. నా ఇంటి పేరు మార్చి శునకానందం పొందారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై నేను కూడా పోలీస్ కేసు పెట్టాను. అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నాం. అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హాననానికి పాల్పడాలంటే భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.’’ అంటూ రాసుకొచ్చారు.