భారత్ సమాచార్, దిల్లీ ;
2024 సార్వత్రిక ఎన్నికల తరుణంలో దేశంలో జరిగిన అతి పెద్ద సంఘటనల్లో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఒకటి. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన ఆయనకు తాజాగా అనూహ్య మలుపుల మధ్య కోర్టులో బెయిలు లభించింది. బెయిల్ పై ఉన్న కేజ్రీవాల్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బీజేపీ పై భారీ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన… తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని, అలా చేస్తే మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ లాంటి విపక్ష పార్టీల ముఖ్యమంత్రులను లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చినట్టేనని ఢిల్లీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఆప్ను ఓడించలేమని ప్రధాని మోదీ భావించి తన అరెస్టుకు కుట్ర పన్నారని ఆరోపించారు. తనను అరెస్టు చేస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని, ఢిల్లీ ప్రభుత్వం పడిపోతుందనేదే మోదీ కుట్ర అని, ఈ కుట్రను విజయవంతం కానివ్వనని తెలిపారు. తనను దెబ్బతీయడానికి తన తల్లిదండ్రులను వేధించవద్దని ప్రధాని మోదీకి కేజ్రీవాల్ హితవు పలికారు. తన తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా నరేంద్ర మోదీ అన్ని హద్దులను దాటారని చెప్పారు. వచ్యే ఎన్నికల్లో మోడీ సర్కార్ ని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.