భారత్ సమాచార్, తాడేపల్లిగూడెం ; ఇప్పటికే 2024 సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండు దశల పొలింగ్ కూడా పూర్తయింది. మే 7వ తేదీన మూడో దశ పోలింగ్ కూడా జరుగనుంది. దేశ వ్యాప్తంగా అన్ని స్థానిక, జాతీయ రాజకీయ పార్టీలు కూడా తమ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసి ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి.
తాజాగా వైసీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో 2024 ఎన్నికల మేనిఫెస్టో నవరత్నాలు+ ను విడుదల చేశారు. ఇంతకు ముందు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెబుతున్నాం మేనిఫెస్టో అంటే రాజకీయ పార్టీకి భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటి పవిత్ర గ్రంథమన్నారు. 2019 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామిలు అమలు చేశామని గుర్తుచేశారు. ఈ ఐదేళ్ల పరిపాలనలో ప్రజా సంక్షేమం కోసం రూ.2 లక్షల 70 వేల కోట్లు DBT ద్వారా నిరు పేదలకు అందించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఇంటికి మేనిఫెస్టోని పంపించామన్నారు. గత ఐదేళ్లలో ఒక మేనిఫెస్టోకు రావాల్సిన గుర్తింపు వచ్చిందన్నారు. ఈ 58 నెలల్లో ప్రతి పథకాన్ని కూడా ప్రతి నిరుపేద ఇంటికి డోర్ డెలివరీ చేసినట్టు పేర్కొన్నారు. ప్రతి సంవతసరం కూడా ముందుగానే ఏ నెలలో ఏ స్కీమ్ ఇస్తామో చెప్పి వాటిని తూచా తప్పకుండా అమలు చేశామన్నారు. ఇచ్చిన హామిల్లో 99 శాతం అమలు చేశామన్నారు. ప్రతి ఏటా కూడా అమలు చేసిన పథకాల గురించి ప్రోగ్రెస్ రిపోర్టు కూడా రూపొందించామన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం రెండు పేజీల మేనిఫెస్టోని రూపొందించి విడుదల చేశారు. ఈ సారి మేనిఫెస్టోకి నవరత్నాలు+ అనే పేరుని పెట్టారు. అలాగే ఇంతకు ముందు ప్రకటించిన పథకాలను కొనసాగిస్తూ వాటి ద్వారా పొందే లబ్దిని పెంచారు. వైయస్ఆర్ రైతు భరోసా సాయాన్ని రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచారు. ప్రతి ఏటా రూ.16వేల చొప్పున ఐదేళ్లలో రైతులకు ఒక్కొక్కరికీ రూ.80 వేల చొప్పున సాయం అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకాన్ని రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచారు. ఆప్కాస్లో రూ.25 వేల వరకు జీతం పొందుతున్నఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు, అంగన్వాడీలు, ఆశావర్కర్ల కుటుంబాలకు విద్య, వైద్యం, ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల పథకాలు వర్తింపు చేయనున్నట్టు మేనిఫెస్టోలో పేర్కొన్నారు.