భారత్ సమాచార్.నెట్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) పురస్కరించుకుని ఈ నెల 21న రికార్డు సృష్టించేందుకు ఏపీ ప్రభుత్వం (Ap Govt) కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. యోగాంధ్ర (Yoga Andhra) పేరుతో విశాఖపట్నం (Vizag) కేంద్రంగా జరగనున్న ఈ మహా కార్యక్రమంలో ఏకంగా 5లక్షల మంది పాల్గొనేలా ప్రణాళికలు రచించింది. అంతే కాదు 40 దేశాల ప్రతినిధులు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరుకానుండటంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
సీఎం చంద్రాబాబు ఈసారి విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారని కేంద్రమంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి 40 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నట్లు కూడా ఆయన తెలిపారు. ప్రజల్లో యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, వారిని ఆరోగ్యవంతులుగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో ఉదయం 6.30 – 7.00 గంటల మధ్య జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారని 7 నుంచి 7.45 గంటల వరకు యోగాభ్యాసం సాగుతుందని కేంద్రమంత్రి వివరించారు. ఇందులో 19 – 20 యోగాసనాలు వేస్తారని వయస్సు, జెండర్తో సంబంధం లేకుండా ఎక్కువ మంది చేయగలిగే యోగ ప్రక్రియలకు ఇందులో చోటు కల్పించినట్లు తెలిపారు. కాగా ఈ భారీ యోగా ప్రదర్శన ద్వారా సూరత్లో నెలకొల్పిన గిన్నిస్ ప్రపంచ రికార్డును అధిగమించడంతో పాటు, 108 సూర్య నమస్కారాలతో మరో ప్రపంచ రికార్డును నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.