భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: గుండాల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొలానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పర్సిక రాజు (35) అనే యువకుడు విద్యుదాఘాతంతో వాహనంతో సహా దగ్ధమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శంభునిగూడెం పంచాయతీ వెన్నెలబైలు గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజు తన ద్విచక్ర వాహనంపై వ్యవసాయ పొలం వద్దకు వెళ్తుండగా, విద్యుత్ హై టెన్షన్ తీగలు తగిలాయి. దీంతో ద్విచక్ర వాహనం దగ్ధమై రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మంటల్లో కాలిపోతున్న యువకుడిని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని కథనాలు