భారత్ సమాచార్, విజయవాడ ;
గడచిన పదేళ్లలో దేశానికి ప్రధానిగా మోడీ అన్ని వర్గాల వారినీ మోసం చేసి, మతం పేరుతో దేశప్రజలపై విద్వేషపు కోరలు చాచి, దేశ ఐక్యతను, ప్రజల మధ్య సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయాత్నాలు చేస్తూనే ఉన్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. మరీ ముఖ్యంగా మోడీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అతి తీవ్రంగా నష్టపోయి, అన్నివిధాలుగా సర్వనాశనం అయిపోయిందన్నారు. రాష్ట్రానికి మోడీ చేసింది అన్యాయం కాదు, అవి నేరాలు, పాపాలని విమర్శించారు. అటు మొదటి ఐదేళ్లల్లో టీడీపీ తో కలిసి ఉన్న బీజేపీ, విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా తీర్చలేదన్నారు. అటు కుమారుని కోసం చంద్రబాబు, కేసుల భయంతో జగన్, ఇద్దరు బీజేపీని ఎదిరించి నిలదీసే దైర్యం ఒక్కసారి కూడా చెయ్యలేదన్నారు.
ఈ రోజు మళ్లీ, ఏ టీడీపీతో ఐయితే తిట్టించుకున్నారో, ఏ టీడీపీని అయితే తిట్టారో. వారితో కలిసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. ప్రజలు దీన్ని గమనించాలని కోరారు. పోనీలే వారితో మాత్రమే ఉన్నారా అంటే అసలు కాదు, అటు తెరచాటుగా జగన్ తో కూడా దోస్తీ చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ఇంత సిగ్గుమాలిన రాజకీయం చేస్తూ, రాష్ట్రాన్ని భ్రస్టు పట్టిస్తూ, అటు రాష్ట్రానికి ఎటువంటి మంచి చెయ్యని మోడీ, ఏ మొహం పెట్టుకుని మాటిమాటికీ ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ గడ్డపైకి కాలుమోపుతున్నారని ప్రశ్నించారు? అందుకే ఆయన మీద కాంగ్రెస్ పార్టీ ఏపీ ఓటర్ల తరపున ఈ రోజు ఈ ఛార్జ్ షీట్ విడుదల చేస్తోందన్నారు. దమ్ముంటే, ఆత్మసాక్షి ఉంటే ఆరు కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాటిచ్చి మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ వినండి, అందులో మీరు నేరస్తులుగా ఉన్నారన్నారు. అందుకే పదేళ్ల బీజేపీ పాలనపై ఆంధ్రకు జరిగిన పది అన్యాయాలతో ఈ ఛార్జ్ షీట్ ప్రజల తరపున తీసుకుకివస్తున్నామని తెలిపారు.
1) నాడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని, తర్వాత ఆ మాటమరిచి రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచారు.
2) జగన్ రివర్స్ టెండెరింగును అడ్డుకోకుండా, పోలవరం ప్రాజెక్టు వినాశనానికి నాంది పలికారు. దాన్ని ఎత్తుతగ్గించే కుట్రలు కూడా చేస్తున్నారు.
3) మీ చేతులమీదుగా భూమిపూజ జరిపించుకున్న అమరావతి రాజధాని పదేళ్ల తర్వాత కూడా పూర్తి కాలేదు. పోరాటాలు, ప్రాణార్పణ ద్వారా సాకారమైన విశాఖ ఉక్కును, అక్కడి సెంటిమెంటుకు విరుద్ధంగా అమ్మేద్దామని చూస్తూ, మళ్ళీ విశాఖ మీద దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారు.
5) కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ వంటివి, విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలను తుంగలోతొక్కి, రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసారు.
6) మీ దత్తపుత్రుడు మద్యం సిండికేటు నడుపుతూ, కల్తీ మద్యంతో మనుషుల ప్రాణాలు తీస్తున్నా మీరు ఉలకలేదు, పలకలేదు. ఢిల్లీలో కేజ్రివాల్ ను అరెస్టు చేసారు. ఇక్కడ మాత్రం ఎటువంటి చర్యలు లేవు.
7) దేశంలో ఎస్సీ, ఎస్టీల రేజర్వేషన్లను అంతం చేయటానికి పూనుకున్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా, మీ కమిషన్లకు ఫిర్యాదులు చేస్తున్నా, మీరు రాష్ట్ర సర్కారును ప్రశ్నించలేదు. చర్యలకు ఉపక్రమించలేదు.
8) ఇసుక, మద్యం, ఖనిజాలు, అక్రమ కాంట్రాక్టులు, దొంగదారిలో రాష్ట్రం చేస్తున్న అప్పులు, కేంద్ర ఇచ్చే నిధుల మళ్లింపు, ఇలా ఎటు చూసినా రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నా, కేంద్రం నుండి ఎటువంటి చర్యలు లేవు.
9) కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐ వచ్చి, చేతకాక, శాంతిభద్రతల సమస్యంటూ బెదిరి వెనుతిరిగింది. ఈ విషయంలో మీ సర్కారు మిన్నకుండి కూర్చోవటం యావత్ దేశానికే అవమానం.
10) దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మాటయిచ్చి, మాట తప్పి, దేశ యువతను, నిరుద్యోగులను ఘోరంగా మోసం చేసారు.