భారత్ సమాచార్, తిరుమల ;
వచ్చే నెల జూన్ 1వ తేదీ నుంచి తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించటానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీకారం చుడుతోంది. జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఐదు రోజులు పాటు ఆకాశ గంగలో శ్రీ బాలాంజనేయ స్వామి, శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహించడంతోపాటు జపాలి తీర్థంలో కన్నుల పండుగగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించనున్నారు.
అంజనాద్రి ఆంజనేయ ఆలయంలో…
హనుమత్ జయంతి సందర్భంగా ఆకాశ గంగలోని శ్రీ అంజనాదేవి- శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో ఈ ఐదు రోజుల పాటు ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు అభిషేకం చేయనున్నారు. మొదటి రోజు జూన్ 1న మల్లెపూలు, జూన్ 2న తమలపాకులు, జూన్ 3న ఎర్ర గన్నేరు మరియు కనకాంబరం, జూన్ 4న చామంతి మరియు చివరి రోజైన జూన్ 5న సింధూరంతో అభిషేకం చేస్తారు. వేద పండితులచే శ్రీ ఆంజనేయ సహస్ర నామార్చన, మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి, అంజనాదేవికి అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు ఆకాశ గంగ వద్ద శ్రీ ఆంజనేయ జన్మ వృత్తాంతంపై ప్రవచన కార్యక్రమం ఉంటుంది.
హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం…
ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్య దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా యొక్క సామూహిక పారాయణం నిర్వహించనున్నారు. జూన్ 1న హరికథ, జూన్ 2 న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే సంకీర్తనలు, జూన్ 3న పురంధర దాస సంకీర్తనలు, జూన్ 4న హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే భజన, జూన్ 5న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే హరికథ గానం నిర్వహిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులచే నృత్య కార్యక్రమాలు ఉంటాయి.
నాద నీరాజనం వేదికపై…
నాద నీరాజనం వేదికపై ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య శ్రీ హనుమన్ జననం మరియు శ్రీ హనుమంతునికి సంబంధించిన ఇతర ఆసక్తికరమైన అంశాలపై ప్రముఖ వేద పండితులచే ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…
26-05-2024 రోజున శ్రీవారిని 89,161 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తితో తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తుల సంఖ్య 36,450 మంది. స్వామివారి హుండీ ఆదాయం 3.77 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సూమారుగా 5 గంటల సమయం పడుతోంది. రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.