భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 ఉభయసభల్లో ఆమోదం పొందింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ఈ బిల్లు సభ ముందుకు తెచ్చింది. బుధవారం లోక్సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన ఈ బిల్లు.. తాజాగా రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది.
ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేస్తే చట్టంగా మారనుంది. అప్పడు అధికారికంగా కేంద్రం గేజిట్ జారీ చేయనుంది. గత కొంత కాలంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఆర్థికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకోవడం.. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా మనీలాండరింగ్, ఆర్థిక మోసాలు వంటి ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ చట్టం అమల్లోకి వస్తే బెట్టింగ్ మోసాలకు చెక్ పడనుంది.
అయితే ఈ బిల్లులో ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య తేడాలు ఉండేలా ఈ బిల్లును రూపొందించింది కేంద్రం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ అందించి.. ఇలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వారికి జైలు శిక్షతో సహా జరిమానా విధించేలా కేంద్రం ఈ బిల్లును తయారు చేసింది. అలాగే వీటికి సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో ఎవరి ప్రమేయం ఉన్న వారికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించనుంది.
మరిన్ని కథనాలు:
Online gaming bill: మూజువాణి ఓటుతో ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం